సోషల్ మీడియా వేదిక ఇన్స్టాగ్రామ్ తమ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా వినియోగదారులు ఫుడ్ ఆర్డర్ చేసుకునే సదుపాయం కల్పించింది. కరోనా నేపథ్యంలో చిన్న రెస్టారెంట్లను ఆదుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఇన్స్టాగ్రామ్ చెబుతోంది. ఇందుకోసం స్విగ్గీ, జొమాటోలతో భాగస్వామ్యం అవుతున్నట్టు ప్రకటన చేసింది. వినియోగదారులు ఆహారాన్ని ఆర్డర్ చేసుకోడానికి ప్రత్యేక ఫుడ్ ఆర్డర్ స్టిక్కర్లను సైతం ఇన్స్టాగ్రామ్ విడుదల చేయడం గమనార్హం.
చిన్న వ్యాపారాలు కొనసాగడానికి, కస్టమర్లతో సన్నిహితంగా ఉండటానికి మా వంతు కృషి చేయాలనుకుంటున్నామని... స్విగ్గీ, జోమాటోతో భాగస్వామ్యం కావడం మాకు సంతోషంగా ఉందని... ఇన్స్టాగ్రామ్ ఒక ప్రకటనలో తెలిపింది. వినియోగదారులు తమ ఇన్స్టా స్టోరీ, ప్రొఫైల్లో స్విగ్గీ, జోమాటో లింక్ను షేర్ చేసుకోవచ్చని ఇన్స్టాగ్రామ్ పేర్కొంది.