వాయిదా పడిన ‘2020 సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష’ను అక్టోబర్ 4న నిర్వహించనున్నట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శుక్రవారం ప్రకటించింది. వాస్తవానికి ఈ పరీక్షను మే 31న నిర్వహించాలి. కానీ కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్డౌన్ కారణంగా పరీక్ష వాయిదా పడింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 4న ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించనున్నట్లు యూపీఎస్సీ తెలిపింది. మెయిన్స్ పరీక్షలు వచ్చే ఏడాది జనవరి 8 నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించింది.
అలాగే గతేడాది నిర్వహించిన సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిలో కొందరికి ఇంకా పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) నిర్వహించలేదని, దీనిని వచ్చేనెల 20 నుంచి నిర్వహించనున్నామని పేర్కొంది. ఎన్డీఏ, ఎన్ఏ (1), ఎన్డీఏ, ఎన్ఏ (2)లకు కలిపి నిర్వహించే కామన్ పరీక్షను సెప్టెంబర్ 6న నిర్వహించనున్నట్లు వివరించింది.