కరోనా మహమ్మారి చైనా నుంచి ఏ దుర్మూహూర్తంలో భారత్ కి చేరిందో కానీ ప్రతిరోజూ కేసులు, మరణాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఎంతగా అంటే మహరాష్ట్రలో చైనా ని దాటిపోయింది. తాజాగా దేశంలో గత 24 గంటల్లో 9985 మందికి కరోనా వైరస్ సంక్రమించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఇవాళ వెల్లడించింది. గత 24 గంటల్లోనే 279 మంది కూడా మరణించినట్లు పేర్కొన్నది. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం వైరస్ కేసుల సంఖ్య 276583గా ఉంది. దీంట్లో 133632 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక వైరస్ శ్యాంపిల్ పరీక్షలు దేశంలో 50 లక్షలు దాటినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.
గత 24 గంటల్లో దేశంలో 142216 మందికి వైరస్ పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ పేర్కొన్నది. భారత్లో రికవరీ కేసుల సంఖ్య పెరుగుతున్నది. 135206 కేసులు రికవర్ అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొన్నది. దేశంలో ఇప్పటి వరకు కోవిడ్19 వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి మొత్తం సంఖ్య 7745గా ఉందని ప్రభుత్వం పేర్కొన్నది. యాక్టివ్గా ఉన్న కేసుల కన్నా.. రికవరీ కేసులు ఎక్కువగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 48.9 శాతంగా ఉన్నట్లుగా ప్రభుత్వం పేర్కొన్నది.