దేశంలో కరోనా కేసులు ఏ విధంగా పెరిగిపోతున్నాయో అందరికీ తెలిసిందే. ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా.. భద్రతా చర్యలు పాటిస్తున్నా.. లాక్ డౌన్ కొనసాగించినా కేసులు మాత్రం ఆగడం లేదు. చెలరేగిపోతున్న ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేయాలంటే కఠిన నిబంధనలు అమలు చేయడం తప్ప మరో మార్గం లేదన్నారు. అయితే, ఇప్పటికే విధించిన లాక్డౌన్ కారణంగా ప్రజలు విసిగిపోతున్నారని అన్నారు. వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోందని, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, పరిశుభ్రత చర్యలు తీసుకోవడం వంటి వాటిని తప్పనిసరిగా పాటిస్తే వైరస్ను కొంతవరకు దూరం పెట్టొచ్చని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్బేడీ అన్నారు.
అతి తక్కవ జనాభా కలిగిన పుదుచ్చేరి లాంటి ప్రాంతాల్లోనే రోజుకు 30కి తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయని కిరణ్బేడీ చెప్పారు. పోలీసులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది కూడా కరోనా మహమ్మారి బారినపడుతున్నారని, ఇక మనలను ఎవరు కాపాడుతారని ఆమె ప్రశ్నించారు. కరోనా విషయంలో ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని.. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణాలకు ప్రమాదం తప్పదని అన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించడం కంటే తరుణోపాయం మరోటి లేదని కిరణ్బేడీ చెప్పారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కరోనా కబలిస్తుందని, అందుకే ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు.