తెలంగాణలో కరోనా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా రాజధాని అయిన హైదరాబాద్లో కరోనా పాజిటివ్ కేసులు అత్యంత వేగంతో పెరుగుతున్నాయి. ఆదివారం నాడు 730 కేసులు తెలంగాణలో బయటపడ్డాయి. రాజధాని నగరంలో ఒక్కరోజే 659 కేసులు రావడంతో కలకలం రేగుతోంది. ఏపీలోనే కాదు… తెలంగాణలో కూడా అన్లాక్ ఎఫెక్ట్ కనపడుతోంది. అన్లాక్ తర్వాత తెలంగాణలో గడచిన 21 రోజుల్లో 5,104 కేసులు పాజిటివ్ వచ్చాయి.
దీనిని బట్టి అక్కడ కేసులు ఎంత శరవేగంగా విస్తరిస్తున్నాయో అర్థమవుతోంది. ఇక తెలంగాణలో మార్చి 22 నుంచి మే 31 వరకు లాక్డౌన్ కొనసాగింది. ఈ కాలంలో కేవలం 2,676 కేసులు మాత్రమే బయటపడ్దాయి. కానీ అన్లాక్ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారింది. గత మూడు రోజులుగా సగటున రోజుకు ఐదువందల కేసులు నమోదు అవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే హైదరాబాద్లో భవిష్యత్తు పరిస్థితులు ఊహించుకునేందుకే భయంగా ఉంది.