ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు నేటితో ముగియనుంది. ఈరోజు వైసీపీ అభ్యర్థిగా డొక్కా మాణిక్యవరప్రసాద్ నామినేషన్ను దాఖలు చేయనున్నారు. అనూహ్యంగా ఆయన స్థానం తిరిగి ఆయనకే దక్కనుంది.. అది కూడా ఎలాంటి పోటీ లేకుండా. ఇది ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామం.. వివరాల్లోకి వెళ్తే.. ఎమ్మెల్సీ అభ్యర్థిగా డొక్కా మాణిక్య వరప్రసాద్ పేరును ఖరారు చేసింది వైసీపీ అధిష్టానం.. ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరగా.. ఆ ఎమ్మెల్సీ స్థానం మళ్లీ ఆయనకే కేటాయించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఇక, ఇవాళ్టితో ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ల గడువు ముగియనుంది.
టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న ఆయన గత శాసనమండలి సమావేశాలకు ముందే పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. మూడు రాజధానుల బిల్లుపై శాసనమండలిలో ఓటింగ్ జరిగినప్పుడు ఓటును కూడా వినియోగించుకోలేదు. దీంతో డొక్కా మాణిక్య వరప్రసాద్ ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
టీడీపీ నుంచి పోటీ లేకుంటే ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది.. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ పోటీపెట్టకపోవచ్చు అనే ప్రచారం జరుగుతోంది.. ఇక ఆయన నామినేషన్ దాఖలు చేస్తే.. ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు. రాజధాని బిల్లుల సమయంలో ఎమ్మెల్సీ పదవికి, టీడీపీకి రాజీనామా చేసి షాక్ ఇచ్చిన.. డొక్కా.. మళ్లీ ఎమ్మెల్సీగా సభలో అడుగుపెట్టనున్నారు.