ఏడాది క్రితం తనను పెళ్లి చేసుకుని.. అదనపు కట్నం కోసం రెండో వివాహానికి సిద్ధమయ్యాడని ఆరోపిస్తూ ఓ మహిళ తన భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. సంవత్సరం అయినా తనను కాపురానికి తీసుకెళ్లడం లేదని ఆరోపించింది. తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంటోంది.నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని రవీంద్ర నగర్ కాలనీకి చెందిన సుమతికి, గాంధీనగర్​కు చెందిన సదానందంతో ఏడాది క్రితం పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. 

 

 

సదానందం హైదరాబాద్​లో ఫొటోగ్రాఫర్​గా పని చేస్తున్నాడు. పెళ్లైన నెల రోజుల వరకు బాగానే ఉన్న సదానందం.. ఆ తర్వాత అదనపు కట్నం కోసం వేధించడం ప్రారంభించాడు. ఫలితంగా ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. ఈ క్రమంలో సదానందం సుమతిని పుట్టింట్లో వదిలేసి వెళ్లాడు. పెద్దలు సర్దిచెప్పినా కాపురానికి తీసుకెళ్లలేదు.

 

 

 ఫలితంగా సంవత్సరం నుంచి సుమతి పుట్టింటి వద్దే ఉంటోంది.ఈ క్రమంలో తన భర్త మరో యువతిని వివాహం చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడని.. గురువారం రాత్రి సదానందానికి చెందిన భవనం పైకి ఎక్కి సుమతి దూకేందుకు యత్నించింది. స్థానికులు అడ్డుకుని కిందకు తీసుకొచ్చారు. దీంతో ఇంటి గేటు ఎదుట బైఠాయించి న్యాయం చేయాలని నిరసన తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: