సచివాలయ ఉద్యోగినిని కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడు పెట్రోల్ పోసి సజీవ దహనం చేస్తానంటూ బెదిరించిన ఘటన విశాఖ జిల్లా పెదబయలు మండలం గంపరాయి గ్రామంలో చోటుచేసుకుంది. అర‌డ కోట గ్రామానికి చెందిన ఓ యువ‌తి గ్రామ స‌చివాల‌యంలో డిజిట‌ల్ అసిస్టెంట్‌గా ప‌ని చేస్తోంది. అయితే అదే  గ్రామానికి చెందిన యువ‌కుడు ప్ర‌శాంత్‌ యువ‌తిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. త‌న‌ను ప్రేమించ‌క‌పోతే చంపేస్తానంటూ కొద్ది రోజులుగా బెదిరిస్తూ వ‌స్తున్నాడు. 

 

గురువారం ఏకంగా ఆమె ప‌నిచేస్తోన్న ఆఫీస్ ముందుకు వెళ్లి ఆమెను బ‌య‌ట‌కు రావాల‌ని కేక‌లు వేశాడు. తన ప్రేమను అంగీకరించకపోతే పెట్రోల్ పోసి దహనం చేస్తానని, ఎవరొచ్చి కాపాడతారో చూస్తానని బెదిరించాడు. తాను ఆఫీస్‌లో ఉన్నాన‌ని.. త‌న‌ను అవ‌మానించ వ‌ద్ద‌ని ఆమె వేడుకున్నా ప్ర‌శాంత్ చేయి చేసుకున్నాడు. దీంతో అక్క‌డ ఉన్న స్థానికులు అడ్డుకుని ఆ యువ‌కుడిని బ‌య‌ట‌కు పంపేశారు. చివ‌ర‌కు ఆమె ఇన్‌ఛార్జ్ ఎంపీడీవో పూర్ణయ్యకు ఫిర్యాదు చేసింది. తన కుటుంబానికి రక్షణ కల్పించడంతో పాటు, ప్రశాంత్‌పై వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: