ఈ మద్య కరోనా వైరస్ వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు సామాన్య ప్రజలు. ముఖ్యంగా కరోనా వల్ల రోజు కూలీలు, చిరు వ్యాపారులు చాలా కష్టాలు పడుతున్న విషయం తెలిసిందే. కొంత మందికి కరోనా వచ్చిందన్న భయంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరికొంత మంది క్వారంటైన్ కి వెళ్లేందుకు భయపడుతున్నారు.. అలా వెళ్లిన వారు అక్కడి ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక లాక్ డౌన్ వల్ల మానసికంగా ఇబ్బందులు పడుతూ.. ఉపాధి లేకపోవడంతో.. బతకడం భారంగా మారింది. ఓ తల్లి పిల్లలను పోషించడానికి ఇబ్బందిగా మారడంతో.. తన మూడేళ్ల కుమార్తెను చంపి ఆ తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుంది.
ఈ విషాద ఘటన మహారాష్ర్ట పాల్గర్ జిల్లాలోని జవహర్ తాలుకా పరిధిలో జూన్ 22న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. గిరిజన కమ్యూనిటీకి చెందిన ఓ వ్యక్తికి భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. లాక్ డౌన్ కారణంగా.. వారికి ఉపాధి కరువైంది. ఇక ఆకలి కష్టాలు తట్టుకోలేక.. మూడేళ్ల కుమార్తెతో కలిసి సమీప అడవిలోకి వెళ్లింది. చిన్నారిని చంపి తాను ఆత్మహత్య చేసుకుంది. కట్టెలు కొట్టేందుకు గ్రామస్థలు అడవిలోకి వెళ్లగా తల్లీ, పిల్ల కనిపించారు. 22వ తేదీ నుంచే భర్త కూడా భార్యాబిడ్డల ఆచూకీ కోసం గాలిస్తున్నాడు. ఇద్దరి మృతదేహాలను చూసి భర్త బోరున విలపించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.