ఆ యువకుడు ఒక యువతిని ప్రేమించాడు. పెద్దల అనుమతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. నిశ్చితార్ధం చేసుకున్నారు. వచ్చే నెలలో పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. అంతా సంతోషంగా జరుగుతుందనుకుంటుండగానే హఠాత్పరిణామం జరిగింది. ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మనసిచ్చిన అమ్మాయిని మనువాడకుండానే మృతిచెందాడు. ఎందుకు?

 

 

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం చింతకుంటకు చెందిన శేఖర్.. ఆళ్లగడ్డకు చెందిన యువతిని ప్రేమించాడు. పెళ్లికి పెద్దలను ఒప్పించి నిశ్చితార్ధం చేసుకున్నారు. వచ్చే జులైలో వివాహానికి ముహూర్తం నిర్ణయించారు. అయితే ఈలోగానే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

 


పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిశ్చితార్ధం అయిందన్న కారణంతో... యువతీయువకులు బైకుపై, ఆటోల్లో బయట తిరుగుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు పెళ్లి కాకుండా అలా తిరగడం మంచి పద్ధతి కాదని మందలించారు. దీంతో మనస్తాపం చెందిన శేఖర్ మద్యం సేవించి తన ఇంటి సమీపంలోని శ్మశానంలోకి వెళ్లి విషగుళికలు తిన్నాడు. తర్వాత స్నేహితులకు ఫోన్ చేసి తాను విష గుళికలు మింగానని చెప్పాడు. వారు వచ్చి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: