విశాఖ సయినార్ కంపెనీలో గ్యాస్ లీక్ ఘటనపై కేసు నమోదు చేస్తున్నామని సీపీ ఆర్కే మీనా వివరించారు. విశాఖ సాయినార్ కంపెనీలోని బాయిలర్లో గ్యాస్ లీకవడంతో ప్రమాదం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆయన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు.
సాయినార్ కంపెనీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారని చెప్పిన ఆయన... నలుగురు కార్మికులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. మృతుల్లో షిఫ్ట్ ఇన్చార్జ్ నరేంద్ర గుంటూరు జిల్లా తెనాలి వాసి అని... కెమిస్ట్ గౌరీశంకర్ విజయనగరానికి చెందిన వ్యక్తిగా గుర్తించామని ఆయన వివరించారు. ఇక ఈ ఘటనపై సిఎం జగన్ కూడా ఆరా తీసారు. ఘటన వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.