వైసీపీ ఎంపీ కనుమూరు రఘురామ కృష్నంరాజు వ్యవహారం ఇప్పుడు ఎల్లో మీడియా వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. రఘురామ కృష్ణంరాజు పార్టీ అధిష్టానంతో తాడోపేడో తేల్చుకోవాలన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. దీంతో ఎల్లో మీడియాలో మరి కొందరు ఎంపీలు సైతం పార్టీ మారేందుకు రెడీగా ఉన్నారన్న కథనాలు వస్తున్నాయి. ఇదంతా వైసీపీలో కావాలని గందరగోళం క్రియేట్ చేసేందుకే వదులుతోన్న కథనాలుగా కనిపిస్తున్నాయి.
ఇందులో భాగంగానే కొందరు వైసీపీ ఎంపీలు బీజేపీ వైపు చూస్తున్నారంటూ వాట్సాప్, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. ఈ పేర్లలో తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ పేరును కూడా చేర్చారు. ఈ ప్రచారం ఆధారంగా చేసుకుని కొందరు వెబ్సైట్లలోనూ ఆయన పేరు రాశారు.
ఈ ప్రచారంపై తీవ్రంగా స్పందించిన ఆయన గత 30 సంవత్సరాలలో మీడియా ఇంతగా దిగజారిపోవడం తాను ఎప్పుడూ చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పేరు రాసిన పేపర్పై తాను చర్యలు కూడా తీసుకుంటానని చెప్పారు. చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియాతో నాటకాలు ఆడిస్తూ ప్రభుత్వాన్ని విమర్శల పాలు చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. తాను ప్రాణం ఉన్నంత వరకు వైసీపీలోనే ఉంటానని చెప్పారు.