ఈ మద్య మానవ సంబంధాలు దారుణంగా మారిపోతున్నాయి. క్షణికావేవంలో ఐన వారినే అంతం చేస్తున్నారు. చిన్న చిన్న గొడవలతో సొంత వారిని... స్నేహితులను హతమార్చుతున్నారు. తాజాగా నిజామాబాద్లోని నాందేవ్ వాడకు చెందిన రూపేశ్, సతీశ్లు అన్నదమ్ములు. సతీశ్ రోజూ మద్యం తాగి ఇంట్లో గొడవలకు పాల్పడేవాడు. ఈ క్రమంలో సతీశ్ మద్యం తాగొచ్చి అన్న రూపేశ్తో గొడవకు దిగాడు. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన రూపేశ్, తమ్ముడిని బండరాయితో కొట్టి హతమార్చాడు.
అనంతరం తల్లి మమతతో కలిసి హత్యను సహజ మరణంగా చిత్రీకరించి అంత్య క్రియలకు ఏర్పాట్లు చేశారు. మృతదేహాన్ని ఆటోలో శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. అనుమానం వచ్చిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.మూడో పట్టణ సీఐ సత్యనారాయణ, ఎస్సై సంతోశ్లు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు.
అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణలో రూపేశ్, సతీశ్ను బండరాయితో కొట్టి చంపాడని సీఐ సత్యనారాయణ పేర్కొన్నారు. శ్మశాన వాటిక సిబ్బంది సమాచారంతో విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. ఈ మేరకు నిందితులు రూపేశ్, తల్లి మమతలను అరెస్టు చేసినట్లు వివరించారు