దేశంలో కరోనా ఉద్ధృతి పెరిగిపోతున్న వేళ అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. విమాన సర్వీసుల రద్దును జులై 31 వరకు కొనసాగిస్తున్నట్టు పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) వెల్లడించింది. పరిమిత మార్గాల్లో మాత్రమే ప్రయాణికుల విమానాలు కొన్ని నడపనున్నట్టు తెలిపింది. కరోనా కట్టడిలో భాగంగా మార్చి 23 నుంచి అన్ని అంతర్జాతీయ సర్వీసులు నిలిపివేయగా.. ఆ తర్వాత దాన్ని జులై 15 వరకు పొడిగిస్తూ ఇటీవలే నిర్ణయం తీసుకుంది. తాజాగా నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.


అయితే, అమెరికా, కెనడా, ఐరోపా దేశాలతో పాటు గల్ఫ్‌ దేశాలకు ప్రయాణికుల విమాన సర్వీసులకు సంబంధించి ఆయా దేశాల విమానయాన శాఖలు సంప్రదింపులు జరుపుతున్నట్టు డీజీసీఏ ఛైర్మన్‌ అరవింద్‌ సింగ్‌ తెలిపారు. పౌర విమానయానశాఖ కూడా అమెరికా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్‌ నుంచి ద్వైపాకిక్షక సర్వీసులు నడపడంపై దృష్టి సారించినట్టు తెలిపింది. ప్రస్తుతం వందే భారత్‌ మిషన్‌లో భాగంగా మే 6 నుంచి ఎయిరిండియాతో పాటు కొన్ని ప్రైవేటు సంస్థలు ప్రత్యేక విమానాలను నడుపుతన్నాయి. ఇప్పటికే దేశీయ ప్రయాణికుల విమాన సర్వీసులతో పాటు కార్గో సర్వీసులు యథాతథంగా నడుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: