గోదావరి మళ్లింపు ద్వారా ఆదా అయ్యే నీటిని రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని ప్రాజెక్టులకు వినియోగించుకుంటామంటూ కృష్ణా బోర్డుకు ఏపీ లేఖ రాసింది. తెలుగుగంగ, హంద్రీనీవా, గాలేరు-నగరి, వెలిగొండ ప్రాజెక్టులను లేఖలో పేర్కొంది. ఇటీవల జరిగిన భేటీలోని మినిట్స్ను తెలుగురాష్ట్రాలకు కృష్ణానదీ యాజమాన్య బోర్డు పంపగా వాటిపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఏపీ భారీగా మార్పులు సూచించింది.
పోలవరం నిర్మాణం వల్ల కృష్ణాలోకి మళ్లించే 45 టీఎంసీలను తెలంగాణ వినియోగించుకోవడంపై 2018 ఫిబ్రవరిలో కేంద్రజల్శక్తి శాఖ వద్ద చర్చ జరగ్గా ఇరురాష్ట్రాల అభిప్రాయాలను కృష్ణాబోర్డు తమకు పంపుతుందని కేంద్రం పేర్కొన్నదని లేఖలో ఏపీ ప్రస్తావించింది. అయితే కృష్ణా జల వివాద ట్రైబ్యునల్-2 ముందు ,తెలంగాణ స్టేట్మెంట్ ఆఫ్ కేస్లో ఈ అంశాన్ని లేవనెత్తిందని ట్రైబ్యునల్ దాన్ని పరిగణనలోకి తీసుకుందని ఏపీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమావేశంలో చెప్పినా ఈ విషయం బోర్డు మినిట్స్లో రికార్డు కాలేదని లేఖలో పేర్కొంది.