ఏపీలో అధికార వైసీపీ నేతలకు దిమ్మతిరిగి పోయే షాక్ తగిలింది. ప్రభుత్వం ప్రజలకు సేవలు అందించేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వార్డు వలంటీర్లు తాము పనులు చేయలేమని.. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు తట్టుకోలేమని తమ వలంటీర్ పదవులను వదులు కుంటున్నారు. కొద్ది రోజుల క్రితం గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఒకే వార్డుకు చెందిన ముగ్గురు వలంటీర్లు తమ పదవులకు రాజీనామా చేసిన ఘటన మరువక ముందే ఇప్పుడు తాజాగా అదే గుంటూరు జిల్లాలో మరో మహిళా వలంటీర్ రాజీనామా చేశారు.
నరసరావుపేటలో వార్డు వలంటీర్ లలిత రాజీవామా చేశారు. మరో షాక్ ఏంటంటే టీడీపీ ఇన్చార్జ్ చదలవాడ అరవింద ఆధ్వర్యంలో ఆ పార్టీలో లలిత చేరారు. వలంటీర్తో పాటు 25 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక రాజీనామా చేశానని లలిత తెలిపారు. ఇళ్ల స్థలాల ఎంపిక విషయంలో వార్డు వలంటీర్లకు - వైసీపీ నేతలకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. లలిత వలంటీర్ పదవి వదులుకుని టీడీపీలో చేరడం అధికార పార్టీ నేతల మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది.