కరోనా దెబ్బతో హైదరాబాద్ మెట్రో మూతపడింది. మెట్రో రైళ్లు ఈ నెలలోనూ పట్టాలెక్కుతాయా..? లేదా..? అనే అంశం సంశయంగా మారింది. కోవిడ్ విసిరిన పంజాకు ఈ ఏడాది మార్చి 22 నుంచి రైళ్ల రాకపోకలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. వాస్తవానికి మెట్రో ప్రారంభమైనప్పటి నుంచి రోజుకు 4.5 లక్ష మంది ప్రయాణికులు హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించేవారు. హైదరాబాద్ మెట్రో పెద్ద సందడిగా ఉండేది. అయితే ఇప్పుడు మెట్రో రైళ్లు ఆగిపోవడంతో సంస్థకు భారీ నష్టాలు తప్పడం లేదు.
రైళ్లు, స్టేషన్ల నిర్వహణ వ్యయం తడిసిమోపెడవుతుండడంతో ప్రతి నెలా రూ.50 కోట్ల మేర నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. మొత్తంగా ఈ నెలాఖరుకు నష్టాలు రూ.200 కోట్లకు చేరుకుంటాయని అంచనా. మరోవైపు మెట్రో వర్గాలు మాత్రం ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటామని, శానిటైజేషన్ చేస్తామని.. తమకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.