ఆల్‌రౌండ్​ ప్రదర్శనతో ముంబయి అదరగొట్టింది. అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో బెంగళూరును అయిదు వికెట్ల తేడాతో చిత్తుచేసింది. ఈ విజయంతో 13వ సీజన్‌లో ప్లేఆఫ్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. మొదట టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కల్‌ (74) అర్ధశతకం సాధించాడు. ఆ జట్టును బుమ్రా (3/14) దెబ్బతీశాడు. అనంతరం బరిలోకి దిగిన ముంబయి 19.1 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సూర్యకుమార్‌ (79*) అజేయ అర్ధశతకంతో విజృంభించాడు.



ఛేదనకు దిగిన ముంబయికి గొప్ప ఆరంభమేమి లభించలేదు. డికాక్‌ (18)ను సిరాజ్‌ ఔట్‌ చేయడం వల్ల 37 పరుగులకు తొలివికెట్‌ కోల్పోయింది. కొద్దిసేపటికే ఇషాన్‌ కిషన్‌ (25), సౌరభ్‌ తివారి (5) వెనుదిరిగారు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన కృనాల్ పాండ్య (10)తో కలిసి సూర్యకుమార్ ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. అయితే కృనాల్‌ను చాహల్‌ ఔట్‌ చేసి ముంబయిని దెబ్బతీశాడు. వికెట్లు పడుతున్నా మరోవైపు సూర్యకుమార్‌ తన పోరాటం కొనసాగించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: