సరిహద్దు దేశాలతో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ.. భారత్ క్షిపణి ప్రయోగాలను ముమ్మరం చేస్తోంది. ఈ మేరకు బ్రహ్మోస్ క్షిపణితో భారీ ప్రయోగాన్ని చేపట్టింది భారత వాయిసేన. సుఖోయ్-30 ఎమ్కేఐ యుద్ధ విమానం ద్వారా ప్రయోగించిన బ్రహ్మోస్.. 4 వేల కిలోమీటర్ల దూరంలోని హిందూ మహసముద్రంలో ఉన్న నౌకను ధ్వంసం చేసింది.పంజాబ్ వైమానిక స్థావరం నుంచి బయలుదేరిన విమానం మార్గమధ్యలో గాలిలోనే ఇంధనం నింపుకొని లక్ష్యం వైపు దూసుకెళ్లినట్లు వాయిసేన అధికారులు తెలిపారు.
భారత నావికాదళం శుక్రవారం.. నౌకా విధ్వంసక క్షిపణి(యాంటీ షిప్ మిసైల్) ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. క్షిపణి కార్వెట్ ఐఎన్ఎస్ కోరా నుంచి బంగాళాఖాతంలో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు.గరిష్ఠ దూరంలో ఉంచిన ఓ నౌకను లక్ష్యంగా చేసుకొని ప్రయోగం నిర్వహించగా.. క్షిపణి అత్యంత కచ్చితత్వంతో ఛేదించినట్లు నావికాదళ అధికార ప్రతినిధి వెల్లడించారు.