హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు ఆదివారం నుండి మరో బంపర్‌ ఆఫర్‌ అందుబాటులోకి రానుంది. మెట్రో స్మార్ట్ రీఛార్జ్‌పై 50 శాతం వరకు అంటే దాదాపు రూ.600 వరకు క్యాష్ బ్యాక్ వచ్చే ఆఫర్ అమల్లోకి తీసుకురానున్నారు. దీనికి సంబంధించిన వివరాలను మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

ఇక మెట్రో స్టేషన్లు, ఆన్‌లైన్‌లో రీఛార్జ్‌ చేసుకునే వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుందని ఆయన స్పష్టం చేశారు. ప్రయాణికులకు వచ్చే క్యాష్ బ్యాక్ కూడా స్మార్ట్ కార్డులోనే జమ చేయనున్నట్లు మెట్రో ఎండీ వివరించారు. అయితే, రీఛార్జ్‌ చేసుకున్న మొత్తాన్ని 90 రోజుల్లోగా వినియోగించుకోవాలని ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని మూడు కారిడార్లలో కలిపి నిత్యం 1.30 లక్షల మంది వరకు ప్రయాణిస్తున్నారని వివరించారు. ఇటీవల ప్రకటించిన మెట్రో సువర్ణ ప్యాకేజీలో భాగంగా 40 శాతం రాయితీ ప్రకటించిన సంగతిని గుర్తు చేశారు. మెట్రో ప్రయాణికుల సంఖ్య 30 శాతం పెరిగిందని వివరించారు. మెట్రోలో ప్రయాణించేవారు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: