ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం సాధ్యంకాదని హైకోర్ట్ లో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చేసిన ప్రకటనపై హైకోర్ట్ లో పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది పిటీషన్ దాఖలు చేసారు. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్షంగా ఎన్నికల కమిషనర్ ప్రకటన చేశారని పిటిషన్ లో ప్రభుత్వం వివరించింది.

పిటిషన్ లో ప్రతివాదిగా ఎన్నికల కమిషన్ కార్యదర్శిని చేరుస్తూ... ఎన్నికల కమిషనర్ ప్రకటన సుప్రీంకోర్ట్ ఆదేశాలకు విరుద్ధంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం వ్యాఖ్యానించింది. కరోనా సమయంలో ప్రజారోగ్యం ప్రభుత్వం కర్తవ్యమని, ఇప్పటికే కరోనా కారణంగా 6 వేల మంది మరణించారని పేర్కొంది. గతంలో కరోనా అని ఎన్నికలు వాయిదా వేసి, మరలా ఎన్నికలు నిర్వహిస్తామని కమిషన్ పేర్కొనడంపై అభ్యంతరం తెలిపింది. వెంటనే ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ తగిన ఆదేశాలివ్వాలని హైకోర్ట్ ని ప్రభుత్వం కోరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: