ఇదిలా ఉంటే రైతు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా, ఇతర రాష్ట్రాలకు చెందిన వేలాది మంది రైతులు గత 10 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల వద్ద నిరసనలు కొనసాగిస్తున్నారు. వారిని శాంతపరిచేందుకు కేంద్రం ప్రయత్నిస్తూనే ఉంది. అంతేకాదు ఇంతకు ముందు కూడా వ్యవసాయ చట్టాల్లో సవరణలు చేసేందుకు ప్రయత్నించింది. ఆ మేరకు రైతులకు కొన్ని ప్రతిపాదనలను కూడా పంపించింది. కానీ రైతులు వాటిని అంగీకరించలేదు. కేంద్రం చేసిన ప్రతిపాదన తమకు సంతృప్తికరంగా లేవని ప్రకటించాయి. పూర్తిగా చట్టాలను రద్దు చేస్తేనే వెనక్కి తగ్గుతామని, లేకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించింది. అందులో భాగంగానే ఈ నెల 8న భారత్ బంద్కు పిలుపునిచ్చాయి.
రైతుల ఆందోళనలకు వామ పక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. డిసెంబరు 8న జరగనున్న భారత్ బంద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, మిగతా లెఫ్ట్ పార్టీలు కూడా రైతులకు మద్దతుగా కలిసి రావాలని పిలుపునిచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం మళ్లీ వ్యవసాయ చట్టాలకు సవరణలు చేయడానికే పూనుకోవడం చర్చనీయాంశమవుతోంది. మరి వీటికి రైతు సంఘాలు ఒప్పుకుంటాయో లేదో వేచిచూడాలి.