విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఏపీలో కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 2,500 రేషన్ డోర్ డెలివరీ వాహనాలు సేవలందిస్తాయి. ఇవన్నీ జగన్ చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. ఏపీలోని మిగతా జిల్లాల్లో ఆ వాహనాలను మంత్రులు ప్రారంభిస్తారు. ఈ రోజు మొత్తం 9,260 వాహనాలు ప్రారంభం అయ్యాయి .అధునాతన తూకం యంత్రాలు, అనౌన్స్ మెంట్ కిట్, క్యాష్ బాక్స్, ఫ్యాన్, ఫస్ట్ ఎయిడ్ కిట్ వంటి హంగులతో వున్నాయి ఈ వాహనాలు .
సంవత్సరానికి 830 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతుంది.నాణ్యతపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తొలగించి.. స్వర్ణ రకం బియ్యాన్ని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం పెద్ద కసరత్తే చేసింది.ప్రస్తుత ప్రజా పంపిణీ వ్యవస్ధలో అనేక సమస్యలు ఎదురవుతుండటంతో పాటు.. కొంతమంది దుకాణదారులు సరుకులను నల్లబజారుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా వృద్దులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, రోజువారీ కూలీలు రేషన్ తెచ్చుకొనేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం మొబైల్ వాహనంతో రేషన్ పంపిణీ విధానాన్ని మొదలు పెట్టింది .వాలంటీర్ వ్యవస్ధను ఉపయోగించి ప్రజల సమక్షంలో కార్డుదారుల వేలిముద్రల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని, ఖచ్చితమైన తూకంతో తిరిగి ఉపయోగించగలిగే సంచుల ద్వారా పంపిణీ చేస్తారు. మొదటిసారి ఈ సంచులను ఉచితంగా ఇస్తారు. కల్తీకి ఆస్కారం లేకుండా ప్రతీ బియ్యం బస్తాకూ సీల్ ఉంటుంది.ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రతి గడపకు చేరే విధంగా రేషన్ డోర్ డెలివరీ అనే వినూత్న కార్యక్రమానికి జగన్ రెడీ అవటంతో ఏపీ ప్రజలు ఈ కార్యక్రమం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.