విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే
కృష్ణా జిల్లా కైకలూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలుగుదేశం,
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య గొడవ జరిగింది. రాష్ట్రవ్యాప్త బంద్ను విజయవంతం చేయాలని కోరుతూ తెలుగుదేశం,
వైసీపీ, వామపక్షాలు పట్టణాన్ని బంద్ చేయించారు. అందరం కలిసి ఆందోళన చేస్తున్నప్పుడు నిరసన ప్రదర్శనల్లో ఒక
పార్టీ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంపై మిగతా
పార్టీ నాయకులు అభ్యంతరం తెలిపారు. కైకలూరు
టీడీపీ ఇన్ఛార్జి జయమంగళ వెంకటరమణ చేతిలో ఉన్న ఫ్లెక్సీని
వైసీపీ కార్యకర్తలు చించేశారు. దీంతో ఒక్కసారిగా ఇరుపార్టీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను అదుపుచేసి ఘర్షణ పెద్దది కాకుండా నివారించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాన్ని నిరసిస్తూ జయమంగళ వెంకటరమణ,
పార్టీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు.