బెంగాల్ను అభివృద్ధి చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన
మమతా బెనర్జీ ప్రజలను మోసం చేశారని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆరోపించారు. రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకున్నారని, మమత హయాంలో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ధ్వంసమయ్యాయంటూ ప్రధానమంత్రి మమతపై ఆరోపణలు ఎక్కుపెట్టారు. ప్రజలంతా మిమ్మల్ని అక్కగా నమ్మి ఓటేస్తే మీరు మేనల్లుడికి అత్తలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గతంలో తాను వామపక్షాలకు వ్యతిరేకంగా గళమెత్తిన మమతా బెనర్జీని చూశానని, కానీ ఇప్పుడు ఆమె వేరొకరి భాషలో మాట్లాడుతుండటం చూస్తున్నానన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపచేయకుండా విభజనవైపు నడిపించారని, మతం ఆధారంగా ఇక్కడి ప్రజల్ని విభజించాలని చూశారని, అందుకే ఇక్కడ కమలం వికసించిందన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో జరిగిన బహిరంగసభలో
మోడీ మాట్లాడారు. కొందరు స్నేహితుల కోసమే తాను పనిచేస్తున్నానంటూ వామపక్షాలు ఆరోపించిన నేపథ్యంలో ప్రధాని తాను 130 కోట్లమంది స్నేహితుల కోసం పనిచేస్తున్నానని సభలో వ్యాఖ్యానించారు.