గుంటూరు జిల్లాలో కూడా బ్లాక్ ఫంగస్ కేసులు బయటపడుతున్నాయి. గ్రామాల్లో ఇప్పుడిప్పుడే ఈ కేసులు వస్తుండటంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు.ఈ బ్లాక్ ఫంగస్ ముదిరి కంటికి సోకడంతో కనుగుడ్లు కూడా తీసివేయాల్సి పరిస్థితి వస్తుందని నిపుణులు అంటున్నారు.ప్రధానంగా ఈ బ్లాక్ ఫంగస్ కేసులు కర్నూల్ జిల్లాలో ఎక్కువగా నమోదుకాగా ఇప్పుడు అన్ని జిల్లాల్లో కేసులు బయటపడుతున్నాయి.
తాజగా పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలులో మరో బ్లాక్ ఫంగస్ కేసు బయటపడింది.బ్లాక్ ఫంగస్ బారినపడిన వ్యక్తి ఇంటికి ఆర్డీవో, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, నోడల్ ఆఫీసర్ వెళ్లి బాధితుడితో మాట్లాడి ల్యాబ్ రిపోర్టులను పరిశీలించారు. ఫంగస్ లక్షణాలపై ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేస్తామని ఆర్డీవో తెలిపారు. తక్షణమే మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాటు చేస్తామని అధికారులు బాధితుడికి హామీ ఇచ్చారు.
కోవిడ్ చికిత్సలో అధికంగా స్టెరాయిడ్ వాడటం, ఆక్సిజన్ అందించేప్పుడు స్టెరైల్ నీటికి బదులు సాధారణ నీటిని హ్యుమిడిఫయర్ ద్వారా అందించడం బ్లాక్ ఫంగస్కు కారణమవుతోందని నిపుణులు చెబుతున్నారు. హ్యుమిడిఫయర్లేలో స్టెరైల్ నీటినే ఉపయోగించాలి. కానీ, ప్రైవేటు ఆసుపత్రులు, కొవిడ్ ఐసోలేషన్ కేంద్రాలు, ఇళ్లలో ఉండి చికిత్స పొందుతున్నవారు సాధారణ నల్లా నీటిని వాడేస్తున్నారు. కొవిడ్ చికిత్సలో భాగంగా స్టిరాయిడ్స్ ఇస్తున్నారు. వాటి దుష్పభ్రావాల కారణంగా మ్యూకోర్మైకోసిస్ దాడి చేస్తోంది. కళ్లు, ముక్కు, మెదడు, పళ్లపై ప్రభావం చూపుతోంది.