అమరావతి : జ్వరపీడితుల గుర్తింపునకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఇంటింటి సర్వే చురుగ్గా సాగుతోంద‌న్నారు వైద్య ఆరోగ్య‌శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి అనిల్ కుమార్ సింఘాల్. సోమవారం సాయంత్రానికి ఈ సర్వే పూర్తయ్యే అవకాశముందని తెలిపారు. ఆశా కార్యకర్తలు...ఇంటింటికీ వెళ్లి జ్వరపీడితులను గుర్తిస్తున్నారన్నారు. గుర్తించిన జ్వరపీడితులకు ఎఎన్ఎంలు మందులు, ఐసోలేషన్ కిట్లు అంద‌జేస్తున్నార‌ని... ఇప్పటికే వరకూ 39 వేల మంది జ్వరపీడితులను గుర్తించారన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో వైద్యాధికారుల సమావేశం ఉందని, ఇంటింటి సర్వేపై పూర్తి వివరాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామన్నారు. జర్వపీడితులకు సరైన సమయంలో వైద్య సేవలు అందిస్తే, కరోనా కేసులు, ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుముఖం పడతాయన్నారు.

ఏపీకి ఇచ్చే ఆక్సిజన్ కోటా పెంచాలని కేంద్రాన్ని కోరామన్నారు.గడిచిన 24 గంటల్లో 94,550 కరోనా టెస్టులు నిర్వహించగా, 24,171 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 101 మృతి చెందారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 649 ఆసుపత్రుల్లో 6,493 ఐసీయూ బెడ్లు ఉండగా, 5,971 బెడ్లు రోగులతో నిండి ఉన్నాయన్నారు. ఇంకా 522 బెడ్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆక్సిజన్ బెడ్లు 23,203 ఉండగా, 22,238 రోగులతో నిండిపోయాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో వివిధ ఆసుపత్రుల నుంచి 5,628 మంది కరోనా బాధితులు డిశ్ఛార్జి కాగా, 7,678 మంది ఆసుపత్రుల్లో చేరారన్నారు. 113 కొవిడ్ కేర్ సెంటర్లలో 17,417 మంది వైద్య సేవలు పొందుతున్నారన్నారు.

రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాసుపత్రుల్లో 23,382 రెమిడెసివిర్ ఇంజక్షన్లు అందుబాటుగా ఉన్నాయ‌ని అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. 403 ప్రైవేటు ఆసుపత్రులకు 18,220 రెమిడెసివిర్ ఇంజక్షన్లను అందజేశామన్నారు. రాష్ట్రంలో ఎక్కడా రెమిడెసివిర్ ఇంజక్షన్లు కొరత ఉన్నట్లు ఫిర్యాదు రాలేదన్నారు. రెమిడెసివిర్ ఇంజక్షన్ల వినియోగంపై రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా అధికారుల ఆడిట్ చేస్తున్నారన్నారు. ఆయా జిల్లాల టాస్క్ ఫోర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ లు తనిఖీలు నిర్వహించి పలు ఆసుపత్రులపై ఫైన్ విధించాయన్నారు.  

గడిచిన 24 గంటల్లో కేంద్ర ప్రభుత్వం 600 టన్నులు అందజేసిందన్నారు. రోజూ కంటే 10 టన్నులు అదనంగా వినియోగించామన్నారు. జామ్ నగర్ నుంచి 80 టన్నుల ఆక్సిజన్, జమ్ షెడ్ పూర్ నుంచి 60 టన్నులు, దుర్గాపూర్ నుంచి 40 టన్నుల ఆక్సిజన్ వచ్చిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్ పూర్తి స్థాయి నిల్వలు ఉన్నాయన్నారు. ఇంకా అదనంగా కూడా స్టోరేజ్ చేశామన్నారు. ఏపీకి ఇంకా ఆక్సిజన్ కేటాయింపులు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. ఆదివారం సాయంత్రం ఏపీ, తెలంగాణ, కర్నాటక అధికారులతో కేంద్ర ప్రభుత్వ అధికారులు వీడియో కాన్ఫరెనర్స్ నిర్వహిచనున్నారని, ఆక్సిజన్ కేటాయింపులపై సోమవారం క్లారిటీ వస్తోందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: