ఏపీలో కరోనా కల్లోలం కొనసాగతోంది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అక్కడక్కడా బెడ్ల కొరత ఏర్పడుతోంది.. ప్రభుత్వం కూడా పరిస్థితిని సమీక్షిస్తూ.. అవసరమైన చోట్ల జర్మన్ షెడ్లను నిర్మిస్తోంది.. అక్కడే రోగులకు వైద్యం అందిస్తోంది. ఇక ఆక్సిజన్ బెడ్ల కొరతను అధిగమించేందుకు ఆర్టీసీ వినూత్న ఆలోచన చేస్తోంది. బస్సుల్లో మొబైల్‌ ఆక్సిజన్‌ బెడ్లను అందుబాటులోకి తీసుకొస్తోంది.  కోవిడ్‌ మరణాలకు అడ్డుకట్ట వేసేందుకు త్వరలోనే ఆర్టీసీ బస్సుల్లో మొబైల్‌ ఆక్సిజన్‌ బెడ్లను అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని చెప్పారు. కోవిడ్‌ ఆస్పత్రుల్లో సేవలు మరింత మెరుగుపరిచేందుకు ఏం చేయాలన్న దానిపై మచిలీపట్నంలోని ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో సత్వరమే వైద్యం అందించేలా ఆర్టీసీ స్లీపర్‌ ఏసీ బస్సుల్లో పది ఆక్సిజన్‌ కాన్సెంట్రేట్‌ మిషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం గ్రీన్‌కో సంస్థ అధినేత చలమలశెట్టి అనిల్‌ ముందుకొచ్చినట్టు తెలిపారు.ఇలానే దాతలు మరింత మంది ముందుకు రావాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కోవిడ్‌ ఆస్పత్రుల్లో సేవలందించేందుకు వైద్య కోర్సు చేసిన వారు, నర్సింగ్‌ విద్యార్థులు ముందుకు రావాలని కోరారు. మరికొన్ని జిల్లాల్లో కూడా బస్సుల్లో మొబైల్ ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: