విజయవాడ ఈఎస్ఐ డైరెక్టరేట్ లో మాస్క్ లు, శానిటైజర్ల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డవారిపై విచారణ కొనసాగుతోంది.
నలుగురు అధికారుల బృందంతో ఈఎస్ ఐ డైరెక్టర్ ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఎవరెవరు అక్రమాలకు పాల్పడ్డారనే విషయమై ఈ బృందం ఆధారాలు సేకరిస్తోంది. ఒక కొటేషన్ అంటూ లేకుండా నేరుగా ఒక సూపర్ బజార్ నుంచి కొనుగోలు చేయడం, కార్యదర్శి ఇచ్చిన మెమోకు వ్యతిరేకంగా వ్యవహరించడం, నిబంధనలను పట్టించుకోకుండా మెడికల్ ఎక్విప్మెంట్ కొనుగోలు చేయడం.. తదితర విషయాలపై కూపీ లాగుతున్నారు. ఎంఎస్ఐడీసీ నుంచి మాత్రమే ఔషధాలు, ఇతర పరికరాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను ఉల్లంఘించినవారిపై విచారణ జరిపి కఠిన చర్యల కోసం ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నారు. భారీ మొత్తంలో కొనుగోలు చేయడంతో వీటి విలువ కూడా భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.