ఈటెల రాజేంద‌ర్ భార‌తీయ జ‌న‌తాపార్టీలో చేర‌డ‌మ‌నేది నేతిబీర‌కాయ‌లో నెయ్యి చందాన ఉంద‌ని తెలంగాణ మంత్రి జ‌గ‌దీష్‌రెడ్డి ఎద్దేవా చేశారు. క‌మ‌లం కండువా క‌ప్పుకోవ‌డ‌మే హాస్యాస్పదంగా ఉంద‌ని, ఇన్నిరోజులు ఆయ‌న చెప్పిన‌దానికి, ఈరోజు చేసిన‌దానికి ఏమైనా పొంత‌న ఉందా? అంటూ నిల‌దీశారు. సోమ‌వారం మీడియాతో మాట్లాడిన జ‌గ‌దీష్ రెడ్డి ఈటెల‌పై మండిప‌డ్డారు. పార్టీలో ఏమైనా భేదాభిప్రాయాలుంటే క‌లిసి ప‌రిష్క‌రించుకోవాలికానీ బ‌య‌ట‌కు వెళ్ల‌కూడ‌ద‌ని హిత‌వు ప‌లికారు. హిట్ల‌ర్ వార‌సుల ద‌గ్గ‌ర‌కువెళ్లి నియంతృత్వంమీద పోరాడ‌తాన‌న‌డం కామెడీగా ఉంద‌ని, పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు పెంచి న‌ల్ల‌చ‌ట్టాలు తెచ్చిన బీజేపీలో ఎలా చేరార‌ని ప్ర‌శ్నించారు. ఈటెల‌తోపాటు ఆయ‌న వెంట వెళ్లిన‌వారు కూడా మునిగిపోయే ప‌డ‌వ ఎక్కుతున్నార‌ని, ప్ర‌జ‌ల మ‌ధ్య చిచ్చు పెడుతున్న బీజేపీలో చేర‌డం అంటే హుజూరాబాద్ ప్ర‌జ‌ల‌కు ద్రోహం చేయ‌డ‌మేన‌ని, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీని విమ‌ర్శించే అర్హ‌త ఈటెల రాజేంద‌ర్‌కు లేద‌ని మంత్రి జ‌గ‌దీష్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: