అసత్య ప్రచారాలతో దేశాన్ని పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ దేశ ద్రోహానికి పాల్పడుతోందన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సాకే శైలజానాథ్. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలనే బీజేపీ నేతలు ఇప్పటికీ పాటిస్తున్నారని ఆరోపించారు. అబద్ధాలు చెప్పడంలో మోదీ సర్కార్ పీహెచ్డీ చేసిందన్నారు. నిజాన్ని దాచిపెట్టి... అసత్యాలనే ప్రజలపై రుద్దేందుకు చూస్తోందన్నారు. దేశ భద్రతకు ముప్పు తెచ్చేలా కేంద్రం వ్యవహరిస్తోందని... పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రులు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. ఆక్సిజన్ కొరత వల్ల దేశంలో ఒక్కరు కూడా మృతి చెందలేదని పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానాన్ని తప్పుబట్టారు శైలజానాథ్. మృతుల కుటుంబాలను పరామర్శిస్తే... మంత్రులకు, బీజేపీ పెద్దలకు నిజాలు తెలుస్తాయన్నారు. ఆక్సిజన్ కొరత లేనప్పుడు... విదేశాల నుంచి ఆక్సిజన్ ను ఎందుకు దిగుమతి చేసుకున్నారని ప్రశ్నించారు శైలజానాథ్. ఇంత మంది చనిపోతే చివరికి ప్రజల ప్రాణాల పట్ల కూడా అబద్దాలు చెప్పేంత దైర్యం వున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని శైలజానాథ్ అన్నారు. పౌరుల ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగేలా ప్రముఖుల ఫోన్లు హ్యాకింగ్ చేసినందుకు మోదీ సర్కార్ ను రాష్ట్రపతి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: