భారత్ విజేత కావాలి : డిప్యూటీ సీఎం ధర్మాన
సరయిన వసతుల కల్పన ఎక్కడ
ఇది మరో ప్రశ్న
విశ్వ విజేత భారత్ కావాలన్నది తమ అభిమతం అని అన్నారు డిప్యూటీ సీఎం ధర్మాన.. అయితే రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా వసతుల మనుగుడ, మెరుగుదల అన్నది ఏ పాటివో అన్నది ఇప్పటికే తేటతెల్లం అయిపోయింది. టోక్యోలో పతకాల సాధన సంగతి అటుంచితే అసలు మంచి స్టేడియం అన్నది శ్రీకాకుళానికే లేదు. అలాంటప్పుడు పతకాలు ఎలా వస్తాయి. ఒలంపిక్స్ మాట అటుంచి జాతీయ స్థాయిలో రాణించాలన్నా .. ఇప్పటి వసతులు చాలవు అన్నది ఓ వాస్తవం. కానీ ఇవేవీ పట్టని ప్రభుత్వం చీర్ అప్ ఇండియాకు సై అంటోంది. ఆ వివరాలివి
టోక్యో వాకిట రేపటి నుంచి ప్రారంభం కానున్న ఒలంపిక్స్ కు సంబంధించి భారత్ విజేత కావాలని ఆకాంక్షిస్తూ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాసు తన అభినందనలు తెలిపారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఛీర్ అప్ ఇండియా పేరిట నిర్వహించిన కార్యక్రమా నికి ముఖ్య అతిథిగా హాజరై భారతీయుల ఆకాంక్షలను ప్రతిఫలించేలా ఈ సారి క్రీడాకారులు తమ శక్తి వంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా నైరాశ్యానికి లోనుకాకుండా మంచి విజయాలు నమోదు చేయాలని కోరారు. 18 క్రీడాంశా ల్లో 127 మంది బరిలోకి దిగుతున్నారని అన్నారు. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు సంబంధిత రంగంలో తదేక దీక్షతో పనిచేసి భవిష్యత్ ను నిర్దేశించే స్థాయికి ఎదిగారని, అందుకు వెయిట్ లిఫ్టర్ కరణం మల్లేశ్వరి, బాక్సర్ మేరీకోమ్, సూపర్ షట్లర్ పీవీ సింధూ లాంటి వారే ఉదాహరణ అని చెప్పారు. పతకం రావాల్సిందే.. కల నెరవేరాల్సిందే అని పేర్కొంటూ క్రీడాభివృద్ధికి తమ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు వివరించారు.