ఇంటర్ ఫలితాల ప్రకటనకు ముహూర్తం ఖరారైంది. కరోనా కారణంగా పరీక్షలు రద్దైనప్పటీకి విద్యార్ఖుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఫలితాలు మాత్రం విడుదల చేస్తామని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ కమిటీ కూడా నియమించారు. రెండు రోజుల క్రితమే ప్రక్రియ మొత్తం పూర్తి చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు నివేదిక సమర్పించారు విద్యా శాఖ అధికారులు. దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో రేపు సాయంత్రం 4 గంటలకు ఫలితాలు విడుదల చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. పోటీ పరీక్షల కోసం విద్యార్థులకు గ్రేడ్ లు అవసరమని... అలాగే భవిష్యత్తులో కూడా ఫలితాలు ఎంతో ఉపయోగపడతాయని మంత్రి ఆదిమూలపు సురేష్ గతంలోనే ప్రకటించారు. చివరి వరకు పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపిన ఏపీ సర్కార్... సుప్రీం కోర్టు ఆదేశాలతో పది, ఇంటర్ పరీక్షలను పూర్తిగా రద్దు చేసింది. అయినా ఫలితాలను తప్పకుండా ప్రకటించి తీరుతామని ముందే స్పష్టం చేసింది. రేపు సాయంత్రం 4 గంటల నుంచి ఇంటర్ ఫలితాలు విద్యార్థులకు ఇంటర్ నెట్ లో అందుబాటులో ఉంటాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: