కోవిడ్-19 టీకా గడువుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు.
మోదీ ప్రభుత్వానికి సత్తా లేదని ప్రజలకు తెలవడానికి, వెన్నెముక లేదనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని రాహుల్ ప్రశ్నించారు. దేశంలో టీకా కార్యక్రమం పూర్తికావడానికి పార్లమెంటులో కేంద్రం స్పందించిన తీరు దారుణమన్నారు. ప్రజల జీవితాలు ప్రమాదకర స్థితికి చేరాయని, ప్రజలకు టీకాలివ్వడానికి గడువేమీ లేదని ప్రభుత్వం చెబుతోందని, టీకాలు ఎక్కడున్నాయని, సరిపడా అందుబాటులో ఉన్నాయా? అని రాహుల్ ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా కొవిడ్ టీకా కార్యక్రమం పూర్తికావడానికి ఒక నిర్దిష్టమైన గడువు కూడా ఏమీ లేదనడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యాన్ని గుర్తుచేస్తోందన్నారు. కోవిడ్-19 టీకా కార్యక్రమానికి సంబంధించిన వివరాలను నరేంద్రమోదీ సర్కార్ శుక్రవారం లోక్సభకు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి రోజురోజుకు తన స్వభావం మార్చుకుంటోందని, దీనివల్ల గడువును నిర్దిష్టంగా చెప్పడం సాధ్యం కాదని తెలిపింది. 18 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయసుగలవారికి ఈ ఏడాది డిసెంబరుకల్లా టీకాలివ్వడం పూర్తవుతాయని ఆశిస్తున్నట్లు చెప్పింది. కొవిడ్ వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతున్న దేశాల్లో మనదేశం కూడా ఉందని నరేంద్రమోడీ సర్కార్ ప్రకటించింది.