సోనూసూద్ ఇళ్లపై ఆదాయపు పన్నుశాఖ దాడులు చేసి రూ.20 కోట్ల పన్ను ఎగ్గొట్టినట్లు ప్రకటించింది. కరోనా కాలంలో విదేశాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా 2 కోట్ల 10 లక్షల రూపాయల విరాళాలు సేకరించారని ఐటీ అధికారులు వెల్లడించారు. దాదాపు నాలుగు రోజుల పాటు ఐటీ అధికారులు సోనూసూద్ను ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దాడుల అనంతరం తాజాగా సోనూసూద్ తన ట్విట్టర్ ఖాతాలో ఒక ఎమెషనల్ పోస్టును పోస్ట్ చేశారు.
‘ప్రతి భారతీయుని ప్రార్థనల ప్రభావం ఎంత బాగా ఉంటుందంటే అధ్వాన్నంగా ఉన్న రోడ్లలో కూడా మనం చేసే ప్రయాణం సులభంగా మారుతుంది’ అని పేర్కొన్నారు. ‘నీలోని నిజాయితీ గాథను నువ్వు ఎవరికీ చెప్పనవసరం లేదు.. కాలమే చెబుతుంది. దేశంలోని ప్రజలకు సేవ చేయడానికి తాను కట్టుబడి ఉన్నానన్నారు. అదే తనకు బలాన్నిస్తుందని, తన ఫౌండేషన్ తరపున ఖర్చుచేస్తున్న ప్రతీ రూపాయీ ఒక విలువైన జీవితాన్ని కాపాడటంతో పాటు అర్హులకు ఈ రూపాయి చేరుతుందన్నారు. తాను మద్దతు పలుకుతున్న బ్రాండ్ల నుంచి వస్తున్న ఆదాయాన్ని అవసరాల్లో ఉన్నవారికి అందిస్తుంటానని, ఇది ఎప్పటికీ కొనసాగుతుంటుందని, నాలుగు రోజులుగా తాను బిజీగా ఉన్నానని, కొంతమంది అతిథుల కారణంగా ప్రజలకు సకాలంలో సేవలందించలేకపోయానని, తిరిగి మీకు సేవలదిస్తానన్నారు. తన జర్నీ ఇలాగే కొనసాగుతుంటుందంటూ పోస్ట్ చేశారు. జై హింద్... సోనూసూద్ అని చివరలో రాశారు.