తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్లుగా చెలామణి అయ్యే కొంతమంది నేత‌ల‌ను పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ప్రణాళిక ప్రకారం సైడ్ చేస్తున్నట్లుగా ఉన్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. కలసి వస్తే సరే లేకపోతే వారి అసంతృప్తిని కూడా లెక్కలోకి రాకుండా చేయడంలో ఒక ప్ర‌ణాళిక ప్ర‌కారం వ్యవహరిస్తున్నారు. తాజాగా తనను క్రికెట్ మ్యాచ్‌కు పిలువలేదని… గ‌జ్వేల్ సభలో మాట్లాడటానికి అవ‌కాశ‌మివ్వ‌లేద‌ని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైరవడం కూడా కామెడీ కోటాలోకే చేరింది.

ఆగ్ర‌హంతో ఊగిపోయిన జ‌గ్గారెడ్డి
అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి శాసనసభ ప్రాంగణంలో పార్టీ నేతలతో మాట్లాడుతూ ఆవేశంతో ర‌గిలిపోయారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కావడానికి ముందే తాను మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యానని, జహీరాబాద్‌లో క్రికెట్ మ్యాచ్ పెట్టి తనను పిలవలేద‌ని, గ‌జ్వేల్ సభలో మాట్లాడేందుకు అవ‌కాశ‌మివ్వ‌లేదంటూ ఆగ్ర‌హంతో ఊగిపోయారు. తాను కూడా పార్టీకి సంబంధం లేకుండా రెండు లక్షల మందితో సభ పెడతానని స‌వాల్ విసిరారు. అయితే జగ్గారెడ్డి మాటలు తెలంగాణ కాంగ్రెస్‌లో ఎలాంటి క‌లకలం రేపలేదు.

చురుగ్గా కార్య‌క్ర‌మాలు
తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత చురుగ్గా కార్యక్రమాలు నిర్వ‌హిస్తున్నారు. అయితే రేవంత్ దూకుడు పార్టీ సీనియర్లలో కొంద‌రికి నచ్చడంలేదు. తమకు పూర్తి స్థాయిలో సమాచారం ఉండటంలేదని, తమకు స్థాయికి తగ్గ గౌరవం ఇవ్వ‌డంలేద‌ని మరికొందరు అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. పార్టీని ఇబ్బంది పెట్టే ప్రకటనలు కూడా చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు చర్చకు వస్తున్నాయి. ఇటీవల ఏఐసిసి తెలంగాణకు పొలిటికల్ అఫైర్స్ కమిటీని నియమించ‌గా, ఆ కమిటీనే అన్ని కార్య‌క్ర‌మాలు ప‌ర్య‌వేక్షిస్తోంది. ఇప్పుడు రేవంత్‌ను టార్గెట్ చేసినా క్యాడర్ పట్టించుకోవ‌డంలేదు. ఇటువంటి ప‌రిణామం సీనియర్లకు కాస్త గడ్డుగా మారింది. ఇక‌నైనా పార్టీకి స‌హ‌క‌రిస్తే బాగుంటుంద‌ని కొంద‌రు నేత‌లు సీనియ‌ర్ల‌కు సూచిస్తున్నారు. మ‌రి స‌హ‌క‌రిస్తారో?  లేదో?  వేచిచూద్దాం..!!


మరింత సమాచారం తెలుసుకోండి: