తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫ్లెక్సికీ శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా తిరుపతిలో వైసీపీ నేతలు, కార్యకర్తలు అంత్యక్రియలు చేపట్టారు. పాడెపై చంద్రబాబు ఫ్లెక్సికి పూలదండలు వేసి ఊరేగించారు. ఓ వ్యక్తి దుస్తులపై పప్పు లోకేశ్ అని రాసి, లోకేశ్ మాస్క్ వేశారు. డప్పు చప్పుళ్లు, ఢ్యాన్స్లతో ఊరేగిస్తూ తీసుకెళ్లారు. చితిపై చంద్రబాబు ఫ్లెక్సిని ఉంచి,దానికి తలకొరివి పెట్టించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది.
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతున్నది. చిన్న చిన్న మాటలే చితికి తలకొరివి పెట్టే దాక వెళ్లాయి. ఇప్పటికే పట్టాభిని రాజమండ్రి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా జనాగ్రహ దీక్షలు వైసీపీ నాయకులు చేపడుతున్నారు. ఈ దీక్షలో పలువురు పలువిధాలుగా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. టీడీపీ, వైసీపీ నాయకులు గత రెండు మూడు రోజుల నుంచి తరుచూ ఎవరో ఒకరు మీడియా ముందుకు వచ్చి ప్రసంగాలు చేపడుతున్నారు. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నచందంగా ఏపీలో రాజకీయం తయారైందని పలువురు చర్చించుకుంటున్నారు.