ఈ ఏడాది ఫిబ్రవరిలో మయన్మార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేపట్టి అధికారాన్ని కైవసం చేసుకున్న అక్కడి సైన్యం.. ఆంగ్ సాన్ సూకితో సహా పలువురు కీలక నేతలను నిర్భందించిన విషయం విధితమే. వారిపై అవినీతి, ఎన్నికలో మోసాలు తదితర అభియోగాలు మోపి విచారణ చేపడుతున్నది. ఈ నేపథ్యంలోనే దేశ సైన్యానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టడంతో పాటు కొవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు గాను సూకీకి మిలిటరీ జుంటా నాలుగేండ్ల జైలు శిక్ష విధించినది. సైన్యానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టినందుకు రెండేడ్లు, కొవిడ్ కు సంబంధించిన ప్రకృతి విపత్తు చట్టాన్ని ఉల్లంఘించినందుకు మరో రెండేళ్ల పాటు జైలు శిక్ష విధించినట్టు జుంటా ప్రతినిధి జామిన్ తున్ వెల్లడించారు.
మరోవైపు హక్కుల పరిరక్షణ సంస్థ ఆమ్నెస్టి ఇంటర్నేషనల్ ఈ శిక్షలను ఖండించినది. తప్పుడు ఆరోపణలపై సూకికి విధించిన శిక్ష స్థానికంగా వ్యతిరేకతను నిర్మూలించేందుకు సైన్యం తీసుకుంటున్న చర్యలకు ఉదాహరణ అని.. ఆ సంస్థ క్యాంపెయినింగ్ డిప్యూటీ రీజనల్ డైరెక్టర్ మింగ్ యూ హా పేర్కొన్నారు. అదేవిధంగా ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూపు మయన్మార్ సీనియర్ సలహాదారు రిచర్డ్ హార్పే కూడా దీనిని ప్రతీకార చర్య అని అభిప్రాయం వ్యక్తం చేసారు.