చిత్ర ప‌రిశ్ర‌మ‌లో వ‌రుస‌గా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్ప‌టికే అనారోగ్యంతో ప‌లువురు, కొవిడ్ మ‌హ‌మ్మారి కార‌ణంగా మ‌రికొంద‌రూ న‌టీన‌టులూ మృతి చెందగా.. తాజాగా మ‌రొక న‌టుడు అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. సినీ న‌టుడు కొంచాడ శ్రీ‌నివాస్‌(47) అనారోగ్యం కార‌ణంగా బాధ‌ప‌డుతూ ఉన్నాడు.

శ్రీ‌కాకుళం జిల్లాలోని ప‌లాస‌-కాశీబుగ్గ మున్సిపాలిటీ ప‌రిధిలోని బ‌స్టాండ్ స‌మీపంలో శ్రీ‌నివాస్ నివాస‌ముంటున్నారు. గ‌త కొద్ది రోజులుగా తీవ్రంగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డుతున్నాడు. కాశీబుగ్గ‌లోని  ఓ ప్ర‌యివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస వ‌దిలారు. ఇప్ప‌టివ‌ర‌కు 40కి పైగా చిత్రాల్లో న‌టించారు. అదేవిధంగా 10కి పైగా టీవీ సీరియ‌ళ్ల‌లో న‌టించి.. ఆది, శంక‌ర్‌దాదా ఎంబీబీఎస్‌, ప్రేమ‌కావాలి, ఆ ఇంట్లో వంటి చిత్రాలు శ్రీ‌నుకు మంచి పేరును తీసుకొచ్చాయి.

షూటింగ్ స‌మ‌యంలో శ్రీ‌ను కింద ప‌డిపోవ‌డంతో అత‌ని ఛాతిపై దెబ్బ‌త‌గిలింది. ఆ త‌రువాత అత‌నికీ గుండెలో స‌మ‌స్య ఉన్న‌ట్టు తెలిసింది. ఆ కార‌ణంగానే శ్రీ‌ను మృతి చెందిన‌ట్టు అత‌ని కుటుంబ స‌భ్యులు వెల్ల‌డించారు. శ్రీ‌ను త‌మ్ముడు ప‌దేళ్ల కింద‌టే మృతి చెందారు. శ్రీ‌నుకు ఇద్ద‌రు అక్కాచెల్లెళ్లున్నారు. ప్ర‌తీ సంక్రాంతికి కాశీబుగ్గ‌లోని త‌న స్వ‌గృహానికి రావ‌డం.. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి పండుగ శ్రీ‌నుకు ఆయ‌వాయితీ అని స్థానికులు పేర్కొంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: