టెక్నాలజీ వినియోగించడంలో యాపిల్ సంస్థ అన్నింటికన్నా ముందు ఉంటుందన్న విషయం తెలిసిందే. ఏ ప్రొడెక్ట్ అయినా చాలా ఖరీదుగా ఉంటుంది. అయినా వినియోగదారులు ఈ ప్రొడక్ట్ అంటేనే ఎక్కువ ఇష్టపడతారు. తాజాగా టెక్ దిగ్గజం యాపిల్ సంస్థపై దక్షిణకొరియాకు చెందిన 60 వేల మంది వినియోగదారులు దావా వేయడం పెను సంచలనానికి దారి తీసింది.
యాపిల్ సంస్థకు చెందిన పాత మోడళ్ల మొబైల్ ఫోన్లు సాఫ్ట్ వేర్ అప్ డేట్ల కారణంగా స్లో అవుతున్నాయని, దీంతో మరమ్మతులకు వేలల్లో ఖర్చవుతోందని ఆరోపిస్తూ 60,000 మంది దక్షిణ కొరియన్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేయకపోతే ఫోన్లు షట్ డౌన్ అయిపోతాయని, అలా పూర్తిగా పోకుండా ఉండేందుకే తాము సరికొత్త కొత్త సాఫ్ట్ వేర్ అప్ డేట్స్ తీసుకొస్తున్నామని యాపిల్ సంస్థ తెలిపింది.
మరమ్మతుల రుసుమును పరిహారంగా యాపిల్ సంస్థే తమకు చెల్లించాలని దావాలో కోరారు. ఫోన్ కొనుగోలు సమయంలో తమకు ఎందుకు చెప్పలేదని వారు యాపిల్ ను ప్రశ్నిస్తున్నారు. వినియోగదారులకు అనుకూలంగా న్యాయస్థానం తీర్పునిస్తే, యాపిల్ సంస్థ 11.9 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాల్సి ఉంటుందని న్యాయనిపుణులు చెబుతున్నారు.