తన కస్టమర్లకు మరింత వేగంగా పార్సిళ్లను డెలివరీ చేయడానికి ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ సరికొత్త ఆలోచనతో ముందుకు వస్తోంది. ఇందుకోసం యువకులకు, గ హిణులకు, రిటైర్డ్ ఉద్యోగులకు పార్ట్టైం జాబ్స్ ఇవ్వబోతున్నారు. పార్ట్టైం వర్కర్లను నియమించుకోవడానికి అమెజాన్ ఫ్లెక్స్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. ఫ్లెక్స్ ద్వారా రద్దీ సమయాల్లో మరింత వేగంగా డెలివరీలు చేయడంతోపాటు ఉబర్ మాదిరి పార్ట్టైం జాబ్స్నూ ఇచ్చినట్టు అవుతుందని కంపెనీ చెబుతోంది.
ప్రైమ్నౌ ఆప్ ద్వారా కిరాణ సామగ్రి ఆర్డర్ చేస్తే రెండు గంటల్లోనే డెలివరీ ఇస్తోంది. ముఖ్యంగా ప్రైమ్ మెంబర్షిప్ ఉన్న వారికి చాలా వస్తువులను ఆర్డర్ చేసిన మరునాడు అందజేస్తోంది.
అమెజాన్ ఫ్లెక్స్లో చేరిన వారు రోజుకు నాలుగు గంటలపాటు పార్సిళ్లను అందజేయాలి. గంటకు రూ.120 నుండి 140 వరకు సంపాదించవచ్చు. ప్రతి బుధవారం జీతం ఇస్తారు. ''దేశవ్యాప్తంగా మా డెలివరీ సామర్థ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకుంటున్నాం. అమెజాన్ ఫ్లెక్స్ వల్ల మరింత కస్టమర్లకు సేవలు అందించగలుగుతాం. మరింత వేగంగా వస్తువులను డెలివరీ ఇస్తాం'' అని అమెజాన్ ఆసియా కస్టమర్ ఫుల్ఫిల్మెంట్ విభాగం వైస్ ప్రెసిడెంట్ అఖిల్ సక్సేనా అన్నారు.
''పండగల వంటి రద్దీ సమయాల్లో గిరాకీ ఎక్కువ ఉంటుంది. అందుకే షాపులు పార్ట్టైం వర్కర్లను పెట్టుకుంటాయి. అమెజాన్ కూడా ఇదే పనిచేస్తోంది. అయితే ఇవి తాత్కాలిక నియామకాలు కావు. ఎప్పుడూ పనిచేసుకోవచ్చు. వారంలో కొన్ని రోజుల్లో పార్సిళ్లు ఎక్కువ ఉంటాయి. అటువంటప్పుడు పార్ట్టైం వర్కర్లు సాయపడతారు'' అని సక్సేనా వివరించారు.