ఇప్పటికే అనేక రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సదుపాయం కల్పిస్తున్నారు. 2019 డిశంబర్ నాటికి, దేశంలోని మరో 4 వేల స్టేషన్లలో వైఫై సౌకర్యం అందించబోతున్నారు. ఇదే కాకుండా రైల్వే మ్యూజిక్స్ ఫెసిలిటీ కూడా కల్పిస్తోంది. ప్రయాణీకులకు ఇంటర్నెట్ లేకపోయినా దీని ద్వారా మ్యూజిక్ వినవచ్చు.
మరో ఫ్రీ ఎంటర్టైన్మెంట్
ఇక త్వరలోనే రైళ్లలో ఫ్రీ ఎంటర్టైన్మెంట్ అందుబాటులోకి రాబోతుంది. సీరియళ్లు, సినిమాలు, వీడియోలను మీ అరచేతిలోని స్మార్ట్ ఫోన్ లో ఉచితంగా చూడవచ్చు. ఎలాంటి బ్లర్ లేకుండా ఫుల్ హెచ్డీ వీడియోలు వీక్షించవచ్చు.
రైల్టెల్తో ఒప్పందం
దీని కోసం రైల్వేశాఖ ఒక మొబైల్ యాప్ ను రూపొందించేందుకు రైల్టెల్తో రైల్వే శాఖ ఒప్పందం కూడా కుదుర్చుకుంది. దీనికి సంబంధించిన రిక్వెస్ట్ ప్రపోజల్ను త్వరలోనే ఆ కంపెనీ ప్రకటించనుంది. తెలుగు భాషలో కూడా... దేశంలో రైల్వేశాఖకు విపరీతమైన ఆదాయం తెచ్చిపెడుతున్న ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రైల్వే శాఖ నడుం బిగించింది. ప్రయాణం కూల్ గా సాగేందుకు వారికి నచ్చిన వినోదం అందేలా ఈ యాప్ని తయారు చేస్తోంది. రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్ ద్వారా ఇదే విషయాన్ని తెలిపారు.
రైళ్లలో సదూర ప్రాంతాలకు లాంగ్ జర్నీ చేసే వారికి, ప్రీ లోడెడ్ సినిమాలు, న్యూస్, మ్యూజిక్, టీవీ సీరియల్స్ వంటి వినోద కార్యక్రమాలు అందిస్తారు. ఇవన్నీ తెలుగుతో సహా అన్ని ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉండనున్నాయి. దీని కోసం రైల్టెల్ ద్వారా, ఓ యాప్ను అందుబాటులోకి తీసుకురానుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకుని, వార్తలు, సినిమాలు, ఇతర ప్రోగ్రాంలను ఉచితంగా చూడవచ్చు.
దీనికి ఎలాంటి ఛార్జీలు ఉండవు. అయితే ఈ యాప్ ద్వారా రైల్వేశాఖకు ప్రకటనల రూపంలో ఆదాయం వచ్చే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.