భారతీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా...తన షాకుల పరంపర కొనసాగిస్తోంది. ఈ నెల మొదటి వారంలో మైక్రో ఏటీఎం వినియోగంపై పరిమితి విధించిన సంగతి తెలిసిందే. ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి డబ్బు విత్డ్రా చేసుకునే సదుపాయం మూడుసార్లు ఉండగా...దాన్ని తగ్గిస్తూ నెలకు ఒక్కసారికి మాత్రమే పరిమితం చేసిన సంగతి తెలిసిందే. ఇది ఖాతాదారులకు తీవ్ర నిరాశ కలిగించింది. అదే ఒరవడిలో మరో పిడుగులాంటి నిర్ణయం తీసుకుంది. రూ.లక్షలోపు బ్యాలెన్స్ ఉన్న అకౌంట్లకు వర్తింప చేస్తూ బ్యాంక్ అకౌంట్లలోని డిపాజిట్లపై వడ్డీ రేటును తగ్గించింది. వచ్చే నవంబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని ప్రకటించింది.
రిజర్వు బ్యాంక్ రెపో రేటు తగ్గింపు ఎస్బీఐ నిర్ణయానికి కారణం అయింది. రెపో రేటును 0.25 శాత మేర తగ్గిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం వల్ల రెపో 5.15 శాతానికి దిగొచ్చింది. ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించడం ఇది వరుసగా ఐదోసారి కావడం గమనార్హం. ఈ ఏడాది మొత్తంగా ఆర్బీఐ 135 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించింది. ఈ నేపథ్యంలో సేవింగ్స్ అకౌంట్లపై రూ.లక్ష వరకు డిపాజిట్లపై వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ ఎస్బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఎస్బీఐ రేట్ల కోత నిర్ణయంతో సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ రేటు రూ.3.5 శాతం నుంచి 3.25 శాతానికి చేరుతుంది.ఎస్బీఐ నిర్ణయం మధ్యతరగతి వారిపై ఎక్కువ ప్రభావం చూపడనుందని తెలుస్తోంది. దాదాపు ఎక్కువ మంది అకౌంట్లలో రూ.లక్షకు లోపే బ్యాలెన్స్ ఉంటుంది. ఈ నేపథ్యంలో వారికి బ్యాంక్ నిర్ణయంతో వడ్డీ నష్టం జరగనుంది. రూ.లక్ష పైన బ్యాలెన్స్ ఉన్న సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ రేటులో ఎలాంటి మార్పు చేయకపోవడం గమనార్హం. ఎస్బీఐ బాటలోనే ఇతర బ్యాంకులు కూడా సాగితే...ఖాతాదారులకు నష్టం కలుగుతుందని అంటున్నారు.