వచ్చే నెల నుంచి చార్జీలు పెంచే నిర్ణయాన్ని వోడాఫోన్, ఎయిర్టెల్ సోమవారం ప్రకటించాయి. వాయిస్ మరియు డేటా కోసం ఒక ఫ్లోర్ ధరను ప్రభుత్వం నిర్ణయించడం తో వోడాఫోన్ మరియు ఎయిర్టెల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు, తాజా పరిణామాలపై ఓ కన్ను వేసిన రిలయన్స్ జియో ఇంకా ధరల పెంపు పై ప్రకటన చేసింది.
ముకేశ్ అంబానీ సారథ్యంలోని టెలికం సంస్థ ‘రిలయన్స్ జియో’ త్వరలోనే చార్జీలను పెంచనున్నట్లు మంగళవారం ప్రకటించింది. వచ్చే కొద్ది వారాల్లోనే మొబైల్ ఫోన్ కాల్స్, డేటా చార్జీలను పెంచనున్నామని ప్రకటించిన కంపెనీ.. ఎంత మేర టారిఫ్ పెరగనుందనే అంశంపై నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొంది. దేశీయ టెలికాం రంగాన్ని బలోపేతం చేసి వినియోగదారులకు ప్రయోజనాన్ని అందించడంలో భాగంగా టారిఫ్ను పెంచనున్నామని, జియో వివరణ ఇచ్చింది. దీని వల్ల డేటా వినియోగంపైన, డిజిటల్ అనుసరణపైన ప్రతికూల ప్రభావం ఉండబోదని వ్యాఖ్యానించింది.
తన స్టేట్మెంటులో జియో ఇతర ఆపరేటర్ల తరహాలోనే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని తెలిపింది. రెగ్యులేటరి నిబంధనలకు లోబడి టెలికాం పరిశ్రమను బలోపేతం చేసే చర్యల్లో తోడ్పాటు అందిస్తుందని, కస్టమర్ల విశ్వాసాన్ని కాపాడుతూనే, రానున్న చార్జీల సవరణల వల్ల డిజిటల్ విస్తృతి, డేటా వాడకంపై ప్రభావం చూపకుండా కృషి చేస్తామని పేర్కొంది. అలాగే రెగ్యులేటర్ నిర్ణయిస్తే చార్జీల సవరణ దృష్టి పెడతామని అందుబాటులో అందరికీ డేటా, డిజిటిల్ ఇండియా ప్రయత్నంలో తమ భాగస్వామ్యం కొనసాగుతుందని తెలిపింది.
జియో సెప్టెంబర్లో కొత్తగా 69.83 లక్షల యూజర్లను జత చేసుకోవడంతో కంపెనీ మొత్తం చందాదారుల సంఖ్య 35.52 కోట్లకు చేరింది. ఎయిర్టెల్ 23.8 లక్షల యూజర్లను కోల్పోయింది. సబ్స్క్రైబర్ల సంఖ్య 32.55 కోట్లుగా ఉంది. వోడాఫోన్ ఐడియా 25.7 లక్షల చందాదారులను కోల్పోయింది. ఈ సంస్థ యూజర్ బేస్ 37.24 కోట్లకు తగ్గింది.