బంగారం ధర భగభగమంటుంది. రోజురోజుకు కొండెక్కి కూర్చుంటుంది. ఇక బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది నిజంగా బ్యాడ్న్యూస్ అని చెప్పొచ్చు. అడ్డూఅదుపు లేకుండా పరుగులు పెడుతూనే వస్తోంది. చైనాలో కరోనా వల్ల మరణాల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. చనిపోయిన వారి సంఖ్య ఇప్పటికే 2,000 దాటిపోయింది. దీంతో గ్లోబల్ ఎకానమీపై ప్రతికూల ప్రభావం పడొచ్చనే ఆందోళనలు మళ్లీ మొదలయ్యాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగింది. దీంతో మన మార్కెట్లో కూడా పసిడి ర్యాలీ చేసింది.
గత ఏడు సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయింది బంగారం ధర. హైదరాబాద్లో బంగారం ధర 43వేల మార్క్ను దాటి 44వేల మార్క్కు చేరువైపోయింది. హైదారబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల పసిడి 43,430రూపాయలు కాగా, 22 క్యారెట్ల బంగారం 40వేలకు చేరుకుంది. గత ఐదు రోజుల్లోనే బంగారం ధరలు 1800రూపాయలు పెరిగిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక మరికొన్ని రోజుల్లో మరింత పెరుగుతుందని, 50వేల మార్క్ దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నాయి మార్కెట్ వర్గాలు. పసిడి ధర ఎప్పుడూ పెరుగుతూనే ఉండదు. అలాగే ఎల్లప్పుడూ తగ్గుతూ కూడా రాదు.
బంగారం ధర పరిస్థితులకు అనుగుణంగా తగ్గుతూ పెరుగుతూ వస్తుంది. అలాగే కొన్ని సందర్భాల్లో స్థిరంగా కూడా ఉండొచ్చు. బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి. అలాగే దేశీయంగా కూడా అమెరికా డాలర్తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీన పడితే.. ఆ అంశం కూడా పసిడి మెరుపులకు కారణంగా నిలవొచ్చని పేర్కొన్నారు.