ప్రధాని నరేంద్ర మోదీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో రోజురోజుకు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించటానికి సిద్ధమయ్యారు. కరోనా దెబ్బకు దేశంలోని అన్ని రంగాలు కుదేలవ్వడంతో కొన్ని రోజుల క్రితం కేంద్రం లక్షా డెబ్భై వేల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజ్ ను ప్రకటించింది. కేంద్రం ప్రకటించిన ఈ ప్యాకేజ్ పై వ్యాపారుల, ఉద్యోగుల, సామాన్యుల నుంచి హర్షం వ్యక్తమైంది. 
 
ఆర్థిక నిపుణులు మాత్రం ప్రభుత్వం మొదట ప్రకటించిన ప్యాకేజీ వల్ల దేశ ప్రజలకు పెద్దగా ప్రయోజనం చేకూరదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే కేంద్రం తాజాగా మరో ప్యాకేజ్ ను ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. తొలి ప్యాకేజీలో ప్రజలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన కేంద్రం రెండో ప్యాకేజీలో దేశంలో దెబ్బ తిన్న రంగాలకు ప్రయోజనం చేకూరేలా ప్యాకేజీ ను రూపొందించినట్లు తెలుస్తోంది. 
 
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అతి త్వరలో కేంద్రం నుంచి రెండో ఆర్థిక ప్యాకేజీకి సంబంధించిన కీలక ప్రకటన రానుందని తెలుస్తోంది. రెండో ఆర్థిక ప్యాకేజీలో కేంద్రం పౌర విమానయానం, హాస్పిటాలిటీ, సూక్ష్మ.. మధ్య తరహా పరిశ్రమలకు ప్రయోజనం కలిగే విధంగా చర్యలు తీసుకోనుంది. లాక్ డౌన్ వల్ల తీవ్ర ప్రతికూల ప్రభావం పడిన రంగాలకు కేంద్రం ప్రాధాన్యత ఇవ్వనుందని సమాచారం. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: