భారత బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయాలను ఎగ్గొట్టి బ్రిటన్లో తల దాచుకుంటున్న పారిశ్రామిక వేత్త విజయ్మాల్యాను భారత్కు రప్పించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈమేరకు బ్రిటన్ కూడా ఇందుకు సంసిద్ధత వ్యక్తం చేయడం గమనార్హం. విజయ్ మాల్యాను భారత్కు తరలించేందుకు న్యాయ ప్రక్రియ మొత్తం పూర్తయింది. త్వరిత గతిన విజయ్మాల్యాను భారత్కు తీసుకొచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు ఇవాళ తెలిపాయి. అయితే తనను భారత్కు అప్పగించాలన్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొద్ది రోజుల క్రితం విజయ్మాల్యా యూకే సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అయితే పిటిషన్ను విచారించడానికి బ్రిటన్ సుప్రీం కోర్టు తిరస్కరించడం గమనార్హం.
మాల్యాను భారతదేశానికి అప్పగించాలంటూ వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు 2018 సెప్టెంబర్లో ఇచ్చిన ఆదేశాలను బ్రిటన్ హోంమంత్రి ఆమోదించారు. మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ మాల్యా హైకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు ఆయన అప్పీలును కొట్టివేస్తూ ఏప్రిల్ 20వ తేదీన తీర్పు ఇచ్చింది. విజయ్ మాల్యా 2016 మార్చిలో భారత్ నుంచి బ్రిటన్కు పారిపోయారు. కింగ్ఫిషర్ ఎయిర్ లైన్స్ కంపెనీ కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని తిరిగి చెల్లించలేదని ఆయనపై ఆరోపణలున్నాయి. పలు బ్యాంకులకు రూ.9వేల కోట్లకుపై రుణాలను ఎగవేసినట్లు ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేశాయి.
అప్పులు, ఆర్థిక కష్టాల్లో కింగ్ ఎయిర్లైన్స్ మూతపడిన విషయం తెలిసిందే. కింగ్ఫిషర్ కంపెనీ కోసం బ్యాంకుల నుంచి మాల్యా పెద్ద మొత్తంలో రుణాలు పొందారు. అయితే తిరిగి చెల్లించకుండా విదేశాలకు వెళ్లారని ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. మాల్యా నుంచి మాల్యాకు రావాల్సిన బకాయిలు దాదాపు రూ. రూ.10,000 కోట్ల వరకూ ఉంటాయని సమాచారం. అప్పులతో సంస్థ కుప్పకూలటంతో కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ను మూసివేశారు. భారత్ నుంచి పారిపోయిన మాల్యాపై స్కాట్లండ్ యార్డ్ పోలీసులు 2017 ఏప్రిల్లో మాల్యా అప్పగింతకు వారెంట్ జారీ చేశారు. ప్రస్తుతం మాల్యా 65 లక్షల పౌండ్ల పూచీకత్తుతో బెయిల్ బ్రిటన్లో ఉంటున్న విషయం తెలిసిందే.