ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంది. బస్సుల్లో ప్రస్తుతం ఆన్లైన్ టికెట్ విధానాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. కండక్టర్లు లేకుండానే బస్సులు నడుస్తున్నాయి. అందువల్ల కండక్టర్ లను లాగిస్టిక్ట్ కేంద్రాల్లో ఏజెంట్ లు గా నియమించేందుకు ఆర్టీసీ సిద్ధమవుతోంది. లాక్ డౌన్ లో చేసిన సడలింపులతో ఏపీలో బస్సులకు అంతరాష్ట్ర సర్వీసులు మినహాయించి మిగతా సర్వీసులను కొనసాగిస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా 57 డిపోలు, 2 ప్రధాన బస్ స్టేషన్లలో… మ్యాన్పవర్, హార్డ్వేర్ సరఫరా చేస్తున్నారు కాంట్రాక్టర్లు. మిగిలిన 71 డిపోల్లో ఏజెంట్లు లాజిస్టిక్ వ్యాపారాన్ని రన్ చేస్తున్నారు. కాంట్రాక్టర్స్ నిర్వహిస్తున్న వాటితో పోల్చితే ఏజెంట్స్ నిర్వహిస్తున్న డిపోల్లో తక్కువ ఆదాయం వస్తోందని ఆర్టీసీ గమనించింది.
కౌంటర్లు లేటుగా తెరవటం, త్వరగా మూసేయటం, సేవలు ఆశాజనకంగా లేకపోవడం, నిర్వహణ లోపాల వల్లే బుకింగ్లు తగ్గాయని ఆర్టీసీ భావిస్తోంది. ఇక డిపో అధికారుల పర్యవేక్షణ లోపం ఉందని కూడా ఆర్టీసీకి నివేదికలు అందాయి. ఈ పరిస్థితిపై ఫోకస్ ఉన్నతాధికారులు… ఏజెంట్ల ప్లేసులో కండక్టర్లను నియమించాలని నిర్ణయించారు. ప్రస్తుతం నష్టాలు వస్తున్న డిపోల్లో బుకింగ్ కౌంటర్ల నిర్వహణ కండక్టర్లకు అప్ప్పగించనున్నారు. దీనికోసం డిగ్రీ అర్హత కలిగి కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారిని ఎంపిక చేస్తారు.
ఇందుకు సంబంధించి 142 మంది కండక్టర్లు అవసరమవుతారని భావిస్తోన్న ఆర్టీసీ.. అర్హతలు ఉన్నవారిని ఎంపిక చేయాలని జిల్లా స్థాయి అధికారులకు ఆదేశించింది. డిగ్రీ కలిగి ఉండి, కంప్యూటర్ నాలెడ్జ్, మంచి నడవడిక, ఇతర నైపుణ్యాలున్న కండక్టర్లను ఎంపిక చేయాలని నిర్ణయించింది. జులై 13 నాటికి ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనుంది. ఇదిలా ఉండగా ఆర్టీసీ బస్సు డ్రైవర్లు, కండక్టర్లకు కొత్త బాధ్యతలు అప్పగించనున్నారు. డిపోల్లోని ఆయా విభాగాల్లో వీరి సేవలను వినియోగించుకునేందుకు అధికారులు నిర్ణయించారు. సంస్థ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పొరుగుసేవల సిబ్బందిని తొలగించి వారి స్థానంలో అవకాశం ఉన్నచోట్ల రెగ్యులర్ సిబ్బందిని వినియోగించాలని ఇప్పటికే ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలొచ్చాయి.