స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎకనమిస్ట్‌లు అదిరిపోయే ప్లాన్‌తో ముందుకు వచ్చారు. అడాప్ట్ ఏ ఫ్యామిలీ (ఒక కుటుంబాన్ని దత్తత తీసుకోవడం) స్కీమ్‌తోను ఆవిష్కరించారు. ఈ పథకం కింద పన్ను చెల్లింపుదారులు బీపీఎల్ కుటుంబాన్ని దత్తత తీసుకుంటే వారికి ప్రోత్సాహకాలు అందించాలి. కోవిడ్ 19 కారణంగా పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ‘కుటుంబ దత్తత అనేది పూర్తిగా స్వచ్ఛంద నిర్ణయం. ఇష్టం ఉంటే తీసుకోవచ్చు. లేదంటే లేదు. వార్షిక ఆదాయం రూ.10 లక్షలు లేదా ఆపైన ఉన్న వారు బీపీఎల్ ఫ్యామిలీని ఏడాదిపాటు దత్తత తీసుకుంటే వారికి ప్రోత్సాహకాలు అందించాలి. అంటే ఒక్క బీపీఎల్ కుటుంబానికి నెలకు రూ.5,000 అందిస్తే బాగుంటుందని ఎకనమిస్ట్‌లు పేర్కొంటున్నారు.

కరోనా వైరస్ కారణంగా బీపీఎల్ కుటుంబాలు తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని, కొత్త స్కీమ్ వల్ల కేంద్ర ప్రభుత్వంపై పెద్దగా భారం పడకుండానే వీరికి రూ.60,000 వరకు బెనిఫిట్ కలుగుతుందని ఎస్‌బీఐ ఎకనమిస్ట్‌లు వివరించారు. దేశంలో రూ.10 లక్షలకు పైన వార్షిక ఆదాయం కలిగిన పన్ను చెల్లించే వారు 70 లక్షలకు పైగానే ఉన్నారని పేర్కొన్నారు. వీరిలో కేవలం 10 శాతం మంది స్కీమ్‌లో చేరినా కూడా దాదాపు 7 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందని ఎస్‌బీఐ ఎకనమిస్ట్‌లు తెలిపారు. అయితే ఇలా స్కీమ్‌లో చేరిన వారికి కేంద్ర ప్రభుత్వం రూ.50,000 వరకు పన్ను మినహాయింపు ప్రయోజనం కల్పించాలని సూచించారు. ఇది సెక్షన్ 80సీకి అదనంగా ఉండాలని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: