తెలంగాణ ప్రగతి రథచక్రం ఆర్టీసీ కాస్తా దివాలా దిశగా పయనిస్తోంది. సమయానికి జీతాలు లేవు. రోజురోజుకు బస్సుల సంఖ్యను సైతం తగ్గిస్తున్నారు. వచ్చే ఆదాయం కాస్తా కరిగిపోతోంది. ఇక ఇదే సమయంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు బ్యాంకులు కూడా ఝలక్‌ ఇచ్చాయి. ఇళ్లు తాకట్టు పెట్టి అప్పు తెచ్చిన చందంగా.. ఆర్టీసి ఆస్తులను తనఖా పెట్టి అప్పు అడుగుతున్నా బ్యాంకులు మొహం చాటేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తు ఇచ్చినా... వెయ్యి కోట్ల రూపాయల అప్పు ఇచ్చేందుకు బ్యాంకులు ససేమిరా అంటున్నాయి. దీంతో పేరుగొప్ప ఊరుదిబ్బ అన్నట్లుగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పరిస్థితి తయారైంది. ఇక ఇదే తరుణంలో 60 వేల కోట్ల రూపాయల విలువజేసే ఆస్తులు కలిగిన టీఎస్‌ఆర్టీసీకి బ్యాంకులు ఎందుకు రుణం ఇవ్వనంటున్నాయన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అసలే నష్టాలతో ముక్కుతూ మూలుగుతూ నెట్టుకొస్తున్న సంస్థకు కరోనా మహమ్మారి శాపంలా మారింది. ఒకప్పుడు తెలంగాణలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్టీసీకి ప్రయాణికుల ఆదరణ ఎక్కువ. రైల్వే కనెక్టివిటి చాలా తక్కువగా ఉండటంతో ఆర్టీసి బస్సుపైనే ఎక్కువగా ఆధారపడతారు. ప్రతిరోజూ 14 నుంచి 20 కోట్ల రూపాయల దాకా సంస్థ ఖజానాకు ఆదాయం సమకూరేది. అలాంటిది  కరోనా దెబ్బకు బస్సెక్కేవాళ్లు కరువయ్యారు. అనునిత్యం దాదాపు 70లక్షల మంది ప్రయాణించే ఆర్టీసిలో ఇప్పుడు రాష్టవ్యాప్తంగా 20 లక్షలమంది కూడా ఎక్కడం లేదు. ప్రయాణికులు వ్యక్తిగత వాహనాలకు అలవాటు పడటంతో పాటు వివిధ ప్రాంతాలకు వెళ్లాలన్నా సొంత వాహనాలనే వినియోగిస్తున్నారు. దీంతో 20వేల బస్సులను నడిపే సంస్థ.. ఇప్పుడు సగానికి సగం తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతిరోజు 2 నుంచి 6 కోట్ల వరకే ఆదాయం సమకూర్చుకుంటుంది.

ప్రస్తుతం ఆర్టీసీకి వెయ్యి కోట్ల రూపాయల అప్పు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే- మెయింటెనెన్స్‌, 49 వేల మంది కార్మికులకు జీతాలు ఇవ్వాలంటే.. వచ్చే ఆదాయానికి పెట్టే ఖర్చుకు పొంతన లేదు. దీంతో ఆర్టీసీ మళ్లీ అప్పుల కోసం తిప్పలు పడుతోంది. ప్రతినెలా కార్మికులు దాచుకొనే కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ నిధులను సంస్థ తన అవసరాలకు వాడుకుంది. మొత్తంగా 13వందల కోట్లు సీసీఎస్‌ సొసైటికి యాజమాన్యం తక్షణం చెల్లించాలి. దీనిపై కార్మికులు కోర్టును ఆశ్రయించగా... ఇప్పటికే యాజమాన్యంపై మొట్టికాయలు వేస్తూనే ఉంది హైకోర్డులో విచారణ గడుపు దగ్గర పడటంతో ఆ లోపు రిటైర్టుమెంట్ బెన్ఫిట్‌తో పాటు... సీసీఎస్ ఖాతాలో జమ చేసేందుకు 600 కోట్లు తక్షణం అవసరం పడతాయనీ, మరో 400 కోట్లతో జీతాలు ఇవ్వొచ్చని ఆర్టీసీ అధికారులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: